రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న దగ్గర నుంచి అధికార వైసిపికి తలనొప్పులు మొదలయ్యాయని చెప్పవచ్చు.వై నాట్ 175 అంటూ వైసిపి అధినేత ముందుకు వెళుతుంటే, పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారని వార్తలు వైసిపిలో గుబులు పుట్టిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితులలో 151 స్థానాలలో గెలిచి అధికారం చేపట్టిన వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మాట ఎలా ఉన్నా, సంక్షేమ పథకాలతో ప్రజలకు డబ్బు ఇచ్చారనేది జగమెరిగిన సత్యం.కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎంపీగా పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఆ పార్లమెంటు స్థానం శ్రీకాకుళం.ప్రస్తుతం అక్కడ టిడిపి సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు నియోజకవర్గంలో తనకంటూ సొంత క్యాడర్ ను,గుర్తింపును సంపాదించుకున్నారు. అటువంటి రామ్మోహన్ నాయుడు పై పోటీ చేసేందుకు వైసిపి సీనియర్ నేతలు సైతం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ధర్మాన కృష్ణ దాస్,ధర్మాన ప్రసాదరావు,తమ్మినేని సీతారాం పేర్లను ప్రతిపాదించగా వారు ముగ్గురు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.రామ్మోహన్ నాయుడు కి పోటీగా నిలబెడితే గెలవగలిగిన బలం శ్రీకాకుళం జిల్లాలో ఈ ముగ్గురి నేతలకే ఉన్నదని ఐప్యాక్ సర్వే కూడా స్పష్టం చేస్తోంది.కానీ గత ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఐదు వైసిపి కైవసం చేసుకోగా,రెండు స్థానాలలోనే టిడిపి గెలిచింది.కానీ వైసీపీ గెలిచిన చోట కూడా క్రాస్ ఓటింగ్ తో ఎంపీగా టిడిపి అభ్యర్థి రామ్మోహన్ నాయుడు గెలిచారు.ఇప్పుడు కూడా అదే క్రాస్ ఓటింగ్ భయం సీనియర్లను వెంటాడుతోందని రాజకీయ వర్గాలు అంటున్నారు. మరి వీరి ముగ్గురు పోటీ నుండి తప్పుకుంటే వైసిపి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారా అనేది ఆసక్తికరంగా మారింది.ఆ స్థానం కోసం శ్రీకాకుళంలోని కొందరు వైద్య వృత్తిలో ఉన్న ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
మరి శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థి ఎవరో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే…