ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఉన్నారు. ఈసారి కూడా టికెట్ చంటిబాబుకి అని అందరూ అనుకుంటున్నారు. కానీ గతంలో జగ్గంపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచి, అనారోగ్య కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్న తోట నరసింహం అనారోగ్యం నుండి కోలుకొని, ఇప్పుడు నియోజకవర్గం లో తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆత్మీయ సమావేశాలు అంటూ వైసీపీ క్యాడర్ ను కూడగడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆత్మీయుడైన తోట నరసింహం ఈసారి టికెట్ తనకేనని ప్రచారం మొదలుపెట్టారు. మిథున్ రెడ్డి కూడా అధిష్టానం తోట నరసింహానికే టికెట్ కన్ఫర్మ్ చేసింది త్వరలో ప్రకటిస్తారు అనే సంకేతాలు ప్రజలలోకి వెళ్లడంతో తోట నరసింహం క్యాడర్ ఉత్సాహంతో ఉన్నారు. ఈ వ్యవహారాన్ని అంతా చూస్తున్న జ్యోతుల చంటిబాబు సైలెంట్ గా ఉన్నారు. కానీ జ్యోతుల చంటిబాబు కుమార్తె పెళ్లికి జగన్ తన ఊరికే వెళ్లడంతో తోట నరసింహం ప్రచారం అబద్ధమేమో అనేలా సొంత క్యాడర్ ఆలోచనలో పడింది. చంటిబాబు, తోట నరసింహం ప్రచారాన్ని లైట్ తీసుకుంటున్నారా లేక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనేది రాజకీయ వర్గాలలో ఆసక్తిని పెంచుతుంది. అధిష్టానం ఆదేశిస్తే తోట నరసింహంతో నైనా కలిసి పని చేస్తానని చంటిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ అందరినీ ఆలోచనలో పడ వేస్తుంది.
జగ్గంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున జ్యోతుల నెహ్రూ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారు. తాజాగా నారా భువనేశ్వరి సైతం జగ్గంపేట లో చంద్రబాబు అక్రమ అరెస్ట్ని నిరసిస్తూ దీక్ష చేశారు. జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షకు భారీగా మహిళలు వచ్చారు. ఈ పరిణామాలు నెహ్రూ ఫ్యామిలీకి ప్లస్. వైసీపీలో సీటు గొడవ కూడా ప్లస్ అవుతుంది.