సత్తెనపల్లి నియోజకవర్గం ఇది సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం టిడిపికి కంచుకోట అని చెప్పవచ్చు. కానీ గత ఎన్నికల్లో అనూహ్యంగా జగన్ గాలిలో అంబటి రాంబాబు విజయం సాధించారు. మంత్రిగా కూడా చేశారు. కానీ ఈసారి రాంబాబును పక్కన పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వైసిపి లో వర్గ పోరు ఈసారి వైసీపీ గెలుపుకు ఆటంకంగా మారిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
సత్తెనపల్లిలో వైసిపి తీరు ఇలా ఉంటే టీడీపీ తీరు మరోలా ఉంది. సత్తెనపల్లి కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాల కలయిక. ఈ సామాజిక వర్గాల వారిలో ఒకరే ఎప్పుడూ ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారు. టిడిపి ఇంచార్జి గా కన్నా లక్ష్మీనారాయణను టిడిపి నియమించింది. అప్పటికె ఆ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న సొంత సామాజిక వర్గ నేతలు ఇప్పుడు టిడిపికి ఊహించని ఇబ్బందులను తెస్తున్నారని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గ టికెట్ కోసం రాయపాటి రంగారావు, కోడెల శివరాం, వైవి ఆంజనేయులు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. తమకే టికెట్ అని ధీమాతో పార్టీ కార్యక్రమాలను చురుకుగా చేస్తూ వచ్చారు. కానీ సొంత సామాజిక వర్గం వారిని పక్కన పెట్టి టీడీపీ కన్నా లక్ష్మీనారాయణకు ఇంచార్జి పదవి కట్టబెట్టడంతో వీరు ముగ్గురు పార్టీపై కోపంతో ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇంచార్జి నియమించి ఆరు నెలలైనా నోరు మెదపని నేతలు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీపై ఆరోపణలు చేస్తూ పార్టీ నుంచి బయటకు వెళ్లాలని చూస్తున్నారని టిడిపి నేతలు వాపోతున్నారు. వైవి ఆంజనేయులు రెబెల్ గా పోటీ చేస్తానని బహిరంగంగానే చెబుతున్నారు. రాయపాటి రంగారావు చంద్రబాబును విమర్శిస్తూ పార్టీని వీడారు. కోడెల శివరాం కూడా అదే దారిలోకి వెళతారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇటువంటి తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో???¿ సత్తెనపల్లిలో టిడిపి విజయం కోసం ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తారో అంటూ రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.