టిడిపి జనసేన పొత్తు తర్వాత ఇరు పార్టీలు కాపు ఓటర్ల వైపే దృష్టి పెట్టాయని చెప్పవచ్చు. అసెంబ్లీకి పోటీ చేసేందుకు సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. అలాగే పార్లమెంటు స్థానాలకు కూడా పోటీ చేసేందుకు అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. అలా అన్వేషణలలో కాపు సామాజిక వర్గానికి పట్టున్న ఒక ఐదు నియోజకవర్గాలలో కాపు అభ్యర్థుల కోసం ఇరు పార్టీలు అన్వేషిస్తున్నారు. వాటిలో విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం స్థానాలలో కాపు ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ నియోజకవర్గాలలో ఆర్థికంగా బలమైన కాపు సామాజిక వర్గ నేతల కోసం టిడిపి, వైసిపి రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
విజయనగరం నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. అందుకే టిడిపి అక్కడ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మీసాల గీతను గాని, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కంది చంద్రశేఖర్ ను గాని బరిలో దించాలని ఆలోచిస్తుంది. వైసిపి నుంచి సిట్టింగ్ ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. ఈసారి అతను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తుంటే, బొత్స కుటుంబం నుంచి ఎవరినైనా బరిలో దించాలని వైసిపి ఆలోచిస్తుంది. అనకాపల్లి నుంచి టిడిపి తమ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన బైరా దిలీప్ చక్రవర్తిని బరిలోదించారు. ఇప్పటికే నిరాశ నిస్పృహలతో ఉన్న అనకాపల్లి టిడిపి క్యాడర్ కు దిలీప్ చక్రవర్తి రాక నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. కానీ వైసీపీ తరఫున బలమైన కాపునేత కోసం అన్వేషణ సాగుతోంది. ఎవరు దొరకకపోతే గుడివాడ అమర్నాథ్ ని బరిలో దించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాకినాడ నియోజకవర్గం లో జనసేనకు మంచి పట్టు ఉంది. అంతేకాకుండా కాపు ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గం. కానీ ఈ నియోజకవర్గంలో టిడిపికి, వైసిపికి కాపు అభ్యర్థులే కరువయ్యారు. ఆర్థికంగా బలమైన కాపు నేత కోసం ఇరు పార్టీలు ఎదురుచూస్తున్నాయి. నరసాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు బరిలో ఉన్నారు. అతనికి చెక్ పెట్టేందుకు వైసిపి సరైన కాపు నేత కోసం చూస్తున్నారు. పోటీలో గోకరాజు రామరాజు పేరు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి ఒకరిని పోటీలో ఉంచాలి అని ఆలోచనలో ఉన్నా, బలమైన కాపు నేత అయితే రఘురామకృష్ణం రాజుకు చెక్ పెట్టవచ్చని వైసిపి భావిస్తోంది. ఇంకొక నియోజకవర్గం కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం. ఈ నియోజకవర్గంలో గతంలో టిడిపి తరఫున గౌడ సామాజిక వర్గానికి చెందిన కొనకళ్ళ నారాయణ పోటీలో ఉన్నారు. ఇప్పుడు కాపు ఈక్వేషన్స్ ఆధారంగా వంగవీటి రాధాను బరిలో దించాలని ఆలోచిస్తున్నారు. వైసిపి బలమైన నేత కోసం అన్వేషణ సాగిస్తోంది.
మరి రాబోయే ఎన్నికల్లో కాపు నేతల హవా కొనసాగుతుందా????