రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం మొదలైందని చెప్పవచ్చు. నియోజకవర్గాల వారీగా విజయం సాధిస్తారో ముందుగానే గుర్తించి, వారికి టికెట్ ఇవ్వడంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు తలమునకలుగా ఉన్నాయని చెప్పవచ్చు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా అతని పేరునే వైసీపీ ఖరారు చేసింది.
ఒకానొక సమయంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకత, తీవ్ర అవినీతి ఆరోపణల వలన ఈసారి అతనికి టికెట్ ఇవ్వకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆ వార్తలన్నీ నిజం కాదని నిరూపిస్తూ వైసిపి అధిష్టానం ఈసారి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికే టికెట్ అన్నారు.
టిడిపి తరఫున పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డి ముందుకు రాగా, మాలేపాటి సుబ్బానాయుడు, బీద రవిచంద్ర పేర్లు వినిపించాయి. కానీ మాలేపాటి సుబ్బానాయుడు వైసీపీని తట్టుకొని నిలబడలేరు. కావ్య కృష్ణారెడ్డికి ప్రజాబలం లేదు, బీద రవిచంద్ర తనకి ఆసక్తి లేదంటూ పక్కకి తప్పుకున్నారు. అటువంటి తరుణంలో టిడిపికి పోటీ చేసేందుకే అభ్యర్థులే కరువయ్యారా అని ఆలోచిస్తున్న తరుణంలో పసుపులేటి సుధాకర్ పేరు తెర మీదకు వచ్చింది. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలలో కూడా ముందుండే సుధాకర్ ను పోటీగా నిలబెడితే, ఈసారి కావలిలో టిడిపి జెండా ఎగరవేయవచ్చని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ని ఆర్థికంగా తట్టుకోగల బలమైన నేత కోసం చూసిన టిడిపికి పసుపులేటి సుధాకర్ ఆశాజ్యోతి లా కనిపించారని చెప్పవచ్చు. ఎమ్మెల్యే పై ఉన్న తీవ్ర వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత, అసలు అభివృద్ధి పేరే లేకపోవడం, పారిశుధ్యం లోపించటం, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై తీవ్ర వ్యతిరేకత ఉంది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకత జిల్లాలో మరో నేతపై లేదంటే అతిశయోక్తి కాదు. అందరికీ అందుబాటులో ఉండని ప్రతాప్ కుమార్ రెడ్డికి వైసీపీ మళ్ళీ టికెట్ ఎందుకు ఇచ్చిందంటే కావలిలో ఆర్థికంగా బలం కలిగిన నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తప్ప మరొకరి లేరు.