గ్రామీణ స్థాయిలో ఎన్నో చేశాం.. పట్టణ స్థాయిలో చేస్తున్నాం.. ప్రజలు వెంటే ఉన్నారు! అని పదే పదే చెబుతున్న వైసీపీ నాయకులకు ఇప్పుడు వాస్తవం తెలిసివస్తోందని అంటున్నారు పరిశీలకులు. నాయకులు, మంత్రులు ఒక్కుమ్మడిగా చేపడుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రలకు ఎక్కడా ఆశించిన స్పందన లభించడం లేదు. రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాలు సహా జిల్లాల్లోనూ యాత్రలకు బస్సు వస్తోందే తప్ప.. ప్రజలు రావడం లేదు.
మరోవైపు.. అంతర్గత సర్వేలు చేయిస్తున్న వైసీపీ అధిష్టానానికి ఓటు బ్యాంకు కలవరపెడుతోందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబుపై కేసులు, ఆయనను జైలుకు పంపించడం వంటి పరిణామాలకు ముందు.. తర్వాత.. వైసీపీ గ్రాఫ్ తగ్గిపోయిందని చెబుతున్నారు. ఇంతకుముందు 55 శాతంగా ఉన్న ఈ గ్రాఫ్.. ఈ నెల మొదట్లో 42 శాతానికి అమాంతం దిగిపోయిందని అంతర్గత చర్చల్లో నాయకులు అంగీకరిస్తున్నారు. బాబుపై సానుభూతి తగ్గకపోగా.. మరింత పెరిగడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.
ఇదే విషయాన్ని ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పుకొచ్చారు. “మేం ఎంత చెబుతున్నా.. చంద్రబాబు విషయంలో ప్రజలు ఎందుకో నమ్మడం లేదు. ఈ విషయాన్ని కూడా మేం పరిశీలిస్తున్నారు. ఆయనపై పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ కేసులు నమోదు చేసింది“ అని బేలగా ఆయన చెప్పడం వెనుక.. ఈ నెల తొలి వారంలో చేయించిన సర్వే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలన్న జగన్ వ్యూహానికి ఈ సర్వే బ్రేకులు వేసేలా ఉందని.. ఈ గ్రాఫ్ మరింత తగ్గిపోతే.. ప్రమాదమని మంత్రులు కూడా అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై చంద్రబాబు విషయంలో సీఎం జగన్ దూకుడు తగ్గించే అవకాశం ఉందని.. తాను కూడా ప్రజల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
ReplyReply allForward |