ఎక్కడైనా రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి. అధికార బలం ఉంది కదా..అని ఎడాపెడా ప్రతిపక్షాలని అణిచివేసేలా దాడులు చేయడం, ప్రజలని భయపెట్టేలా ముందుకెళ్లడం, అడ్డగోలుగా అక్రమాలు చేయడం..ఇవన్నీ చేస్తూ కూడా నీతులు మాట్లాడటం..ప్రతిపక్ష నేతని తిట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదనే చెప్పాలి. అన్నీ విషయాలు ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఎన్ని చేసిన నెగిటివ్ అవుతుంది? తప్ప పాజిటివ్ కాదు.
అందుకే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసే రాజకీయమే వైసీపీకి పెద్ద మైనస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో చిత్తూరులో వైసీపీ వన్సైడ్ గా గెలవడానికి పెద్దిరెడ్డి ఎలా కారణమయ్యారో..వచ్చే ఎన్నికల్లో చిత్తూరులో వైసీపీ దెబ్బతినడానికి పెద్దిరెడ్డి కారణం అవుతారని అంటున్నారు. ఎందుకంటే అధికార బలంతో చిత్తూరులో పెద్దిరెడ్డి చేసే కార్యక్రమాలు ప్రజలంతా చూస్తున్నారని, అలాగే కుప్పంలో ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలుసని, తాజాగా చంద్రబాబు పర్యటన విజయవంతం కాకుండా వైసీపీ శ్రేణుల చేత దాడులు చేయించి..ఇంకా బాబు టూర్ని సక్సెస్ చేశారని చెబుతున్నారు.
యథావిధిగా బాబు టూర్ జరిగి ఉంటే ఇంత హైలైట్ కాదని, కానీ పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు చేసిన రాజకీయం బాబు టూర్ సక్సెస్ చేశాయని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి చిత్తూరులో టిడిపి బలం తగ్గిందని, కానీ ఈ నాలుగేళ్లలో టిడిపి ఊహించని విధంగా పుంజుకుందని, దీనికి కారణం పెద్దిరెడ్డి రాజకీయమే అని సొంత పార్టీలోనే కొందరు నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
ఇప్పుడు బాబు పర్యటనపై దాడులు చేసి ఇంకా వైసీపీ దెబ్బతినేలా చేసినట్లు కనిపిస్తున్నారు. అంటే పెద్దిరెడ్డి వల్లే జగన్కు డ్యామేజ్ జరుగుతుందా? అనే భావన సొంత పార్టీ శ్రేణుల్లో సైతం కనిపిస్తుందని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి బాబుకు పెద్దిరెడ్డి పెద్ద ప్లస్ అని చెబుతున్నారు.